కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ (Karimnagar)లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులో చోటుచేసుకున్న కాల్పుల కలకలంపై జిల్లా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిదితుల ఫొటోలను జిల్లా పోలీసులు విడుదల చేశారు. వీరి ఆచూకీ తెలిపిన వారు వెంటనే సమాచారం ఇవ్వగలరని కోరారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తులను ఎవరైనా గుర్తించినట్లయితే లేదా వారికి సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే వెంటనే పోలీస్ అధికారులకు డయల్ 100, 8712670744, 8712670745 లకు తెలియజేయాలని కోరారు. నిందితుల జాడ కనిపెట్టి, వారి గురించి ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి రూ. లక్ష బహుమతి అందజేస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నందున వారిని పట్టుకునేందుకు ప్రజల సహకారం కోరుతున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
కరీంనగర్లోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో తుపాకులతో దుండగులు కాల్పుల కలకలం సృష్టించారు. తుపాకులతో షోరూమ్లోకి చొరబడ్డ ఐదుగురు దుండగులు.. సిబ్బందిపై కాల్పులు జరిపి భయాందోళనకు గురిచేశారు. దాదాపు కిలో బంగారం విలువగల ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. పట్టపగలే జనసంచారం ఉన్న ప్రాంతంలో దోపిడీ జరగడంతో తీవ్ర కలకలం రేపింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు.
కరీంనగర్ జ్యువెలరీ షాపు దోపిడీపై సీపీ గౌస్ ఆలం కీలక వివరాలు వెల్లడించారు. ఐదుగురు దుండగులు కస్టమర్లలా వచ్చి తుపాకులతో బెదిరించినట్లు తెలిపారు. నలుగురు నిందితులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారని.. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు స్పష్టం చేశారు. సుమారు కేజీ బంగారం దోచుకెళ్లినట్లు చెప్పారు.నిందితులు మాస్కులు ధరించకపోవడంతో నలుగురి ముఖాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని వెల్లడించారు.

