కలం, వెబ్ డెస్క్: కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తెలంగాణ క్యాబినెట్ (Telangana Cabinet) నిర్ణయించింది. గురువారం సచివాలయంలో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సనత్ నగర్, ఎల్.బి.నగర్, అల్వాల్ టిమ్స్ తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేసింది.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు, 4,235 ఔట్ సోర్సింగ్ పోస్టులకు అనుమతించింది.ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవలకు సీఎం రిలిఫ్ ఫండ్ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అలాగే, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో నిత్యావసర వస్తువులు గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలను, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కాలపహాడ్ గ్రామంలో 10 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (TGSWC) కు మార్కెట్ రేట్ ప్రకారం కేటాయించేందుకు మంత్రివర్గం అంగీకరించింది.
జవహర్ నవోదయ విద్యాలయాలకు మహబూబ్నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

