కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ‘నాగుల పంచమి’ (Nagula Panchami) వేడుకలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పంచమిని పురస్కరించుకుని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న నాగదేవత ఆలయం, శ్రీ గండి రామన్న ఆలయం, చిట్యాల్ గ్రామంలోని నాగమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుట్టలో పాలు పోసి నాగమ్మ తల్లిని పూజించి, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకుని తమ కుటుంబాలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు తెలిపారు. ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తుల రద్దీ నెలకొనడంతో పండుగ వాతావరణం కనిపించింది.

