కలం, వరంగల్ బ్యూరో: డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ఆరోపించారు. బుధవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్లు పెరుగుతాయని తెలిపారు. 70 కోట్ల ప్రజలకు 540 ఎంపీ సీట్లు ఉన్నాయని, 140 కోట్లకు జనాభా పెరిగిందని, అందుకు అనుగుణంగానే ఎంపీ సీట్లు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. హైబ్రిడ్ సిస్టమ్ అంటూ రేవంత్ రెడ్డి అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు సీట్లు పెరగవు, సెక్షన్ 81 ప్రకారం సీట్లు పెరుగుతాయని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి పెట్టిన ప్రపోజల్ ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు.
దేశంలో విభజన తేవడానికి.. కాంగ్రెస్ పార్టీ దక్షిణాదికి అన్యాయం అని వాదిస్తోందని అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టిందే కాంగ్రెస్ అని ఆయన ఆరోపించారు. గతంలో మహిళా బిల్లు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆమోదించలేకపోయిందని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించేందుకే కాంగ్రెస్ డీలిమిటేషన్ పంచాయతీ ముందుకు తెచ్చింది. హైదరాబాద్ను మూడు ముక్కలు చేసినప్పుడు సీఎం ఎవరిని అడిగారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చెప్పే విషయాలన్నీ అబద్ధాలు, దుష్ప్రచారాలని ఎద్దేవా చేశారు. ఉన్న సీట్లను ఒక పర్సంటేజ్ ప్రకారం పెంచుతామని, ఇండియా అలయన్స్లు విభేదాలను సృష్టిస్తున్నాయని రాంచందర్ రావు (Ramchander Rao) తెలిపారు.

