కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 20న మేడిగడ్డ (Medigadda) బ్యారేజీని సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. గతంలో జరిగిన నష్టాన్ని సరిదిద్ది ప్రాజెక్టును కాపాడాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మేడిగడ్డ వద్ద జరుగుతున్న మరమ్మతు పనుల పురోగతిని, నాణ్యతను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన నివేదిక ఆధారంగా.. రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ నిపుణులు, ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. పనుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

