కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam)లో టీనేజర్లు రెచ్చిపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. శుక్రవారం ఖమ్మంలో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్న సమయంలో కొందరు టీనేజర్లు అనుమానస్పదంగా కనిపించారు. ఈ క్రమంలో యోగీశ్వర్, సాయి కుమార్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా చోరీల ఘటన వెలుగులోకి వచ్చింది.
వీరితోపాటు మరో నలుగురు మైనర్లు ముఠాగా ఏర్పడి బైకులు దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఈ మేరకు దొంగతనం చేసిన 17 మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన మోటారు సైకిళ్లను మెకానిక్స్కు అమ్ముతుండేవారని విచారణలో వెల్లడైంది. ఈ కేసులో బైకులను కొనుక్కున్నవారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ రమణ మూర్తి, ఇన్స్పెక్టర్ మోహన్ బాబు మీడియాకు తెలియజేశారు.

