కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ కార్ల కంపెనీ టాటా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలను (Tata Motors) పెంచుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ పెంపు ఒక్కో కారుపై సగటున 0.5 శాతం ఉండబోతోంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ తో నడిచే కార్ల ధరలు మాత్రమే పెంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఆల్రెడీ ఉన్న ధరల్లో ఈ పర్సెంటేజీ పెంచబోతోంది కంపెనీ. పెరిగిన ఖర్చులను తట్టుకోవడంతో పాటు కంపెనీ లాభాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.
అయితే అన్ని టాటా కార్ల ధరలు (Tata Motors) ఒకే స్థాయిలో పెరగవని కంపెనీ స్పష్టం చేసింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ ను బట్టి ధరల్లో సవరణలు ఉంటాయని తెలిపింది. కార్ల తయారీలో ఉపయోగించే ముడి సరుకు (అల్యూమినియం, స్టీల్) ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఇతర కంపెనీల పోటీని తట్టుకోవడం కోసం తమ కస్టమర్లపై ఎక్కువ భారం పడకుండా కొద్దిగానే ధరలు పెంచినట్టు కంపెనీ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి హ్యాచ్బ్యాక్, సెడాన్, ఎస్యూవీ (SUV) మోడల్స్ లోని అన్ని పెట్రోల్, డీజిల్ కార్ల ధరలు పెరుగుతాయి.

