కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. బెంగాల్ కోసం దీదీ 10 వాగ్దానాలు అంటూ ఓటర్లను ఆకర్షించింది. ఈ పథకాల్లో ప్రధానంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేలా నెలవారీ సహాయాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం జనరల్ కేటగిరీ మహిళలకు నెలకు రూ.1,500 (ఏడాదికి రూ.18,000), ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలకు రూ.1,700 (ఏడాదికి రూ.20,400) పెంచిన మొత్తాన్ని అందించనున్నారు.
అలాగే ‘బంగ్లార్ యువశక్తి’ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి శాశ్వత గృహం, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ప్రకటించారు.
అలాగే రైతుల కోసం రూ.30,000 కోట్లతో భారీ అగ్రి-బడ్జెట్ను కేటాయించనున్నట్లు ప్రకటించింది. భూమి లేని రైతులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు, ఇంటి వద్దకే వైద్యం నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. వీటితో పాటు విద్యా సంస్థల మౌలిక సదుపాయాల కల్పన, వృద్ధులకు నిరంతర పెన్షన్ సదుపాయం కల్పించనుంది. రాష్ట్రంలో ఏడు కొత్త జిల్లాల ఏర్పాటు, బెంగాల్ను తూర్పు భారతదేశపు వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీల్లో పేర్కొంది.

