కలం, వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు (TDP Mahanadu) వేడుకలు రెండో రోజుకు చేరుకున్నాయి. నేడు ఉదయం 10 గంటలకు ఈ ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. ఈ ముగింపు రోజున పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చే ముగింపు ఉపన్యాసంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు, ప్రస్తుత రాజకీయ పరిణామాలకు సంబంధించిన కీలక తీర్మానాలను ఈ వేదికపై ప్రవేశపెట్టనున్నారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలు ప్రజా సమస్యలపై ఈ సభలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం, రైతు సంక్షేమ పథకాలపై ప్రత్యేక తీర్మానం చేయనున్నారు. వీటితో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలు, పొత్తుల దిశగా దిశా నిర్దేశం చేసే అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజకీయ తీర్మానాన్ని మహానాడు చివరి భాగంలో ఆమోదించనున్నారు. క్యాడర్ లో జోష్ నింపేలా సాగనున్న ఈ ముగింపు సభపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

