కలం, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా రాజకీయాల్లో విషాదం నెలకొంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి (80) (HanumanthaRaya Chowdary) కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
హనుమంతరాయ చౌదరి మృతి పట్ల రాజకీయ నేతలు, అభిమానులు, టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆయన, సీనియర్ నాయకుడిగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఉమ్మడి ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్గా హనుమంతరాయ చౌదరి పనిచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా 10 ఏళ్లు పనిచేశారు. హనుమంతరాయ చౌదరి మరణవార్త విన్న వెంటనే టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ ప్రియతమ నేతకు నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

