కలం, వెబ్ డెస్క్ : విజయనగరం (Vizianagaram) జిల్లా రామభద్రపురం మండలం తారాపురం సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భువనేశ్వర్ నుండి మల్కాజిగిరి వైపు వెళ్తున్న ఒడిశాకు చెందిన ఈ బస్సు, ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా వెనుక టైర్ పేలిపోయింది. టైర్ పేలిన వేగానికి ఘర్షణ ఏర్పడి నిమిషాల వ్యవధిలోనే బస్సులో మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, మంటలు వ్యాపించకముందే ప్రయాణికులందరినీ అప్రమత్తం చేసి కిందకు దించేయడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానికి విస్తరించి, వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాద సమయంలో ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పెను ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.

