కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్.. డూప్ డిక్లరేషన్ అయిపోయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) ఎద్దేవా చేశారు. రైతులకు ఇస్తామని చెప్పిన ఎకరానికి రూ. 15 వేలను కాంగ్రెస్ నేతలు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. రైతులతో సమానంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 వేల 600 కొనుగోలు కేంద్రాలు పెడితే, రేవంత్ ప్రభుత్వ హయాంలో అరకొర కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాక్షసుడిలాగా తయారయ్యాడంటూ ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ (Congress Farmer Declaration) పేరిట రైతులను ఎలా మోసం చేస్తుందో చెప్పడానికి, రైతు సదస్సు పేరిట వరంగల్లో పెద్ద సభ ఏర్పాటు చేయబోతున్నామని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (Takkellapalli Ravinder Rao) తెలిపారు. రాష్ట్ర రైతులకు కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్, యూరియా ఇలా అన్నిట్లో మోసం చేసిన విషయాన్ని రైతులకు వివరిస్తామని చెప్పారు. మే 6వ తేదీన ఉదయం 9 గంటలకు వరంగల్ నగరంలో రైతు మహా సభ నిర్వహిస్తామని.. ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని చెప్పారు. తాము సభ పెడుతున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. తమ సభకు అనుమతి ఇవ్వకండని ప్రతీ అధికారిపై ఒత్తిడి తెస్తున్నారని.. తాము కోర్టు ద్వారా అయినా అనుమతి తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.

