కలం, వరంగల్ : ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే విధంగా అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో పచ్చడి ముడిసరుకులు, ఆహార పదార్థాలను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. వరంగల్ (Warangal) నగరంలోని కాశీబుగ్గ (Kashibugga) ప్రాంతంలో, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ నివాస గృహంపై బుధవారం టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతున్న డ్రమ్ములలో భారీ మొత్తంలో పచ్చడి ముడిసరుకులు నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
తనిఖీలలో స్వాధీనం చేసుకున్న పదార్థాలు పూర్తిగా నాణ్యత కోల్పోయి, వినియోగానికి అనర్హంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ నిందితుడు వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి, నగరంలోని పలు చిన్న దుకాణాలకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన అధికారులు ఒకరిని అరెస్టు చేశారు. ఘటన స్థలం నుంచి సుమారు రూ.2.25 లక్షల విలువైన పచ్చడి ముడిసరుకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని టాస్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.

