కలం, నిర్మల్ : నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ (Chityal) గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ వెంకట్ రెడ్డి నాయకత్వంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ నెల 11న మంగళవారం గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని సర్పంచ్ కోరారు.

