కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) సైలెంట్గా పనిచేస్తూనే.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.80.64 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిధులతో అదనపు తరగతి గదులు, ఆధునిక ల్యాబ్ సదుపాయాలు కల్పించబోతున్నట్లు సీఎంవో వెల్లడించింది. పదవిలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న సీఎం విజయ్.. యువత, విద్యార్థులకు మెరుగైన అవకాశాలే లక్ష్యంగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు.
పాలనపై పట్టు తెచ్చుకునేలా..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పూర్తిగా సచివాలయానికే పరిమితమవుతున్న విజయ్.. పాలనపై పట్టు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. అవసరమైనప్పుడల్లా.. కలెక్టర్లు, ఎస్పీలను కూడా లైన్లోకి తీసుకుంటూ, వారి నుంచి వివరాలు తీసుకుంటున్నారు. భోజనం సమయం తప్పించి, ఉదయం నుంచి రాత్రి వరకు ముఖ్యమంత్రి.. వరుస సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

