కలం, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో మహిళా న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి (Justice Madhavi Devi) పై సోషల్ మీడియా వేదికగా జరిగిన దుష్ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన పోస్టులు, వాటి మూలాలు, ప్రచారం చేసిన వ్యక్తుల వివరాలు, కుట్ర కోణం వంటి అంశాలపై సిట్ లోతుగా విచారణ చేపట్టనుంది.
త్వరలో మరింత మందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బండి భగీరథ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి భర్తకు బార్ కౌన్సిల్ ఛైర్మన్ పదవి ఇస్తారంటూ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అనుచిత ఆరోపణలతో కూడిన కథనాలను సర్క్యులేట్ చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు రిజిస్ట్రార్ బీ.చిరంజీవి మే 15న చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసును చార్మినార్ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేసింది.

