కలం, వెబ్ డెస్క్ : తమిళ చిత్రసీమలో మళ్లీ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Tamil Film Producers Council) సంచలన నిర్ణయం తీసుకున్నది. వచ్చే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కౌన్సిల్ ప్రకటించింది. కేవలం సినిమాల విడుదల మాత్రమే కాకుండా, నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా బంద్ చేయాలని నిర్ణయించడం గమనార్హం.
ఈ సడన్ బంద్కి ప్రధాన కారణం థియేటర్, ఓటీటీ విడుదలల మధ్య ఉన్న కాలపరిమితి వివాదమే. థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత కనీసం 8 వారాల సమయం దాటిన తర్వాతే ఓటీటీ ప్లాట్ఫామ్లలోకి తీసుకురావాలని థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతున్నారు. నిర్మాతలు మాత్రం తక్కువ వ్యవధిలోనే ఓటీటీ హక్కులను విక్రయించడం వల్ల థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గిపోయిందని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై స్పష్టమైన రాజీ కుదిరే వరకు పనులు పునఃప్రారంభం అయ్యే అవకాశం కనిపించడం లేదు.

