కలం, వెబ్ డెస్క్: మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై శనివారం నుంచి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) పోరుబాట పట్టింది. నేటి నుంచి ఈ నెల 14 వరకు మూసీ తీర ప్రాంతాల్లో 50 బీఆర్ఎస్వీ బృందాలు పర్యటించనున్నాయి. ఈ మేరకు ప్రజలను కలిసి అన్ని అంశాలను బీఆర్ఎస్వీ బృందాలు వివరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ భవన్ లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) జెండా ఊపి పోరుబాటను ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఆ పేరిట విధ్వంసం చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. మూసీ తీరాన ప్రజలు భయాందోళనల్లో ఉన్నారని చెప్పారు. అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్వీ బృందాలు ప్రజల్లోకి వెళ్లి వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వ దోపిడీ ఆలోచనలను వివరిస్తాయని తెలిపారు. అందరితో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని.. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. అవసరమైతే లక్షలాది మందితో ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్వీ సభ్యులు పాల్గొన్నారు.

