కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ మోసాలను బీసీలు గమనిస్తూనే ఉన్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ బొంద పెట్టడం ఖాయమని అన్నారు. బీసీ సబ్ ప్లాన్ (BC Sub Plan) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. వెనుకబడిన తరగతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్లో రూ.20 వేల కోట్లను ఖర్చు పెడతామని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేశారని అన్నారు. సిద్ధరామయ్యతో అబద్ధాలు చెప్పించి బీసీల ఓట్లు దండుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ఏడాది బీసీ సబ్ ప్లాన్ ద్వారా రూ. 800 కోట్ల ఖర్చు చేస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో ఏడాది రూ.11 వేల కోట్ల నిధులు కేటాయించి, రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు.
బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే టైం వచ్చిందని తలసాని ఫైర్ అయ్యారు. లోకల్ బాడీ ఎలక్షన్లో జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచారని.. అది దేనికి సంకేతమో అర్థం చేసుకోవాలన్నారు. బీసీ విద్యార్థుల కోసం బీసీ గురుకులాలను పెద్ద ఎత్తున ఇచ్చిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు. బడుగుల లింగయ్య యాదవ్ను రాజ్యసభకు పంపించారని గుర్తు చేశారు. అనేక మంది బీసీ నాయకులకు అత్యున్నత పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్ది అని చెప్పారు. కుల వృత్తులను ప్రోత్సహించన ఘనత కేసీఆర్ది అని పేర్కొన్నారు. 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరుతో మోసం చేశారని విమర్శించారు.

