కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో టీమిండియాకు భారీ షాక్. పరుగుల వరద పారిస్తూ భారీ స్కోరు దిశగా సాగుతున్న భారత్ను న్యూజిలాండ్ బౌలర్ జేమ్స్ నీషమ్(James Neesham) ఒకే ఓవర్లో కోలుకోలేని దెబ్బ తీశాడు. 16వ ఓవర్లో.. సెట్ అయిన బ్యాటర్లతో పాటు కెప్టెన్ను కూడా అవుట్ చేసి నీషమ్ మ్యాచ్ను ఒక్కసారిగా కివీస్ వైపు తిప్పాడు. తొలి 15 ఓవర్ల వరకు కేవలం ఒకే వికెట్ కోల్పోయి 200 పరుగుల మార్కును దాటిన భారత్, నీషమ్ దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలింది. మొదట సెంచరీకి చేరువైన సంజూ శాంసన్ (89)ను అవుట్ చేసిన నీషమ్, ఆ తర్వాత ఇషాన్ కిషన్ (54), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లను పెవిలియన్ పంపాడు.
సంజూ శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులు చేసిన చేశాడు. జేమ్స్ నీషమ్ వేసిన హై ఫుల్ టాస్ బంతిని భారీ షాట్ ఆడబోయిన సంజూ, టైమింగ్ కుదరక లాంగ్ ఆన్లో ఉన్న సబ్స్టిట్యూట్ ఫీల్డర్ మెకోంచీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. కేవలం 11 పరుగుల దూరంలో సెంచరీ చేజారడంతో మైదానంలోని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (52) అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్తో కలిసి సంజూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపారు. వీరిద్దరి జోరుతో భారత్ 15.2 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును దాటింది.
25 బంతుల్లో 54 పరుగులు చేసిన ఇషాన్.. లో ఫుల్ టాస్ను భారీ షాట్ ఆడబోయి చాప్మన్కు చిక్కాడు. ఇషాన్ అవుట్ అయిన వెంటనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్య, ఎదుర్కొన్న తొలి బంతికే రచిన్ రవీంద్ర పట్టిన అద్భుత క్యాచ్తో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగారు. జేమ్స్ నీషమ్(James Neesham) కేవలం 2 ఓవర్ల వ్యవధిలోనే 13 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి కివీస్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఉన్నారు. చివరి 4 ఓవర్లలో భారత్ ఈ షాక్ నుంచి కోలుకుని ఎంత మేరకు స్కోరు సాధిస్తుందో చూడాలి.

