కలం, వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ (Cherial Municipal Election) 2వ వార్డు ఎన్నిక ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ వార్డులో పోలీస్ కానిస్టేబుల్ రమేశ్ భార్య గీతాంజలి పోటీ చేశారు. దీంతో పోలీస్శాఖ కానిస్టేబుల్ రమేశ్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. అతడిని కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. అయితే శుక్రవారం విడుదలైన ఫలితాల్లో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ భార్య గీతాంజలి ఘన విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థిపై 223 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. కానిస్టేబుల్ రమేశ్ను (Constable Ramesh) విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే తన భర్త ఎలాంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని, అన్యాయంగా సస్పెన్షన్ విధించారని గీతాంజలి ఆరోపించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడమే కారణంగా తన భర్తపై చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త సస్పెన్షన్ కాంగ్రెస్ నాయకుల కక్షపూరిత చర్యల్లో భాగమని ఆరోపించిన గీతాంజలి, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చేర్యాలలోని (Cherial) అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాల మధ్య జరిగిన ఎన్నికల్లో గీతాంజలి స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించడం స్థానికంగా చర్చకు దారితీసింది.
Read Also: అల్లు శిరీష్-నయనిక పెళ్లి పనులు షురూ.. అల్లు-మెగా ఫ్యామిలీ సందడి
Follow Us On: Sharechat


