కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట (Suryapet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్తుండగా మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో విరుచుకుపడటంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. చివ్వెంల మండలం వల్లభాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం, మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన పలువురు భక్తులు బొలెరో వాహనంలో దురాజ్ పల్లిలోని ప్రసిద్ధ పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయాని (Lingamanthula Swamy Temple)కి మొక్కులు తీర్చుకోవడానికి బయలుదేరారు.
మార్గమధ్యంలో వల్లభాపురం సమీపంలోకి రాగానే, వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక డీసీఎం వాహనం బొలెరోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న జనిగ సతీష్, నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తున్న క్రమంలో జరిగిన ఈ ప్రమాదంతో మేళ్లచెరువు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: సీఎం సీటుపై హరీశ్ రావు కన్ను.. ఎంపీ చామల కామెంట్
Follow Us On: Pinterest

