కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) హద్దులు దాటి మాట్లాడుతున్నారని, వైసీపీ నేతలు కూడా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని జనసేన (Janasena) పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ నేతలపై ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంగళవారం ఆ పార్టీ నేతలు నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. మహిళలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేస్తే ఖండించడం ఏమిటని జగన్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. దీనిపై జనసేన తీవ్ర స్థాయిలో స్పందించింది.
రాజకీయాల్లో విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని జనసేన (Janasena) సూచించింది. విమర్శలు, ఆరోపణలపై చట్టబద్ధంగా న్యాయస్థానాల్లోనూ పోరాడవచ్చని, ప్రతి విమర్శలకు దాడులే సమాధానం కాదని స్పష్టం చేసింది. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రవర్తనను, మాటలను జెన్ జి గమనిస్తోందని, ఆ విషయం వైసీపీ నేతలు మరిచిపోవద్దని సూచించింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా చివరికి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని స్థితిలో ఉన్నా చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయని ఘాటుగా విమర్శించింది. జగన్ పాఠశాల విద్యార్థుల సమక్షంలోనే హద్దులు దాటి, దిగజారుడు మాటలు మాట్లాడారని, భార్యను కారుతో పోల్చి మాట్లాడిన జగన్ వ్యాఖ్యలను ప్రజలు, కూటమి నాయకులు, జనసేన శ్రేణులు మరచిపోలేదని పేర్కొంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడి, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు ఎంత నీచమైనవో ప్రజలందరికీ తెలుసునని పార్టీ గుర్తు చేసింది.
ఎవరు ఎన్ని మాటలు అంటున్నా ప్రజాస్వామ్య రీతిలోనే స్పందించాలని, కుటుంబంలోని మహిళలు, ఆడబిడ్డలపై ఎట్టి పరిస్థితుల్లోనూ కామెంట్స్ చేయవద్దని పవన్ నిర్దేశించిన నియమాలను పార్టీ ముఖ్యులు తెలిపేవారని పార్టీ వెల్లడించింది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యలు చేస్తే నవ్వుతూ ప్రోత్సహించిన వ్యక్తి జగన్ అని మండిపడింది. హైదరాబాద్లో ఓ టీవీ ఛానెల్ కార్యాలయంపై వైసీపీ వ్యక్తులు దాడికి యత్నించిన ఘటనను మంగళవారం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఖండించారని, ఈ అంశంపై పార్టీ ముఖ్యులతో బుధవారం ఉదయం చర్చించారని పార్టీ వెల్లడించింది. ఆ సంస్థ ఎండీ పత్రికలో రాసిన కొత్త పలుకులో ఘాటైన పదాలు ఉన్నాయని అభిప్రాయపడ్డట్లు తెలిపింది. సదరు ఛానెల్లో ప్రసారమైన కార్యక్రమాన్ని తాను వీక్షించలేదని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించినట్లు తెలిపింది. ప్రజా జీవితంలో ఉన్న వారు జెన్ జీని తక్కువ అంచనా వేయవద్దని పవన్ చెప్పినట్లు పార్టీ వెల్లడించింది.
Read Also: అకీరా బర్త్డే… పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్!
Follow Us On : WhatsApp

