కలం, వెబ్ డెస్క్: యూపీలోని గ్రేటర్ నోయిడా (Greater Noida)లో హైవేపై ఓ ట్రక్ డ్రైవర్ (Truck Driver) చేసిన వీరంగం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారీగా కాంక్రీట్ డంప్తో వెళ్తున్న ట్రక్ను ఆర్టీవో అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు రోడ్డుపైనే రాళ్లు డంప్ చేస్తూ నానా హంగామా సృష్టించాడు. వివరాల్లోకి వెళ్తే.. జీబీ నగర్లో ఆర్టీవో అధికారులు తనిఖీల కోసం వెళ్తున్నారు. అదే సమయంలో ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేపై ట్రక్ డ్రైవర్ భారీ లోడ్ తో వెళ్తున్నాడు. అధికారులను చూసిన డ్రైవర్ భయాందోళనకు గురయ్యాడు. తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ప్రమాదకరంగా వ్యవహరించాడు. ట్రక్ను రాంగ్ సైడ్లో నడిపిస్తూ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా, వెంబడిస్తున్న అధికారులను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ట్రక్లో ఉన్న కాంక్రీట్ శిథిలాలను రోడ్డుపై వదిలేస్తూ అలాగే వేగంగా ముందుకు వెళ్లాడు.
దీంతో ఎక్స్ప్రెస్వేపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు తీవ్ర ఎదుర్కొన్నారు. పదుల సంఖ్యలో వాహనాలు పంక్చర్ అయ్యాయి. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో డ్రైవర్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుపై రాళ్లు, వ్యర్థాలు పేరుకుపోవడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఉండేందుకు జేసీబీ యంత్రాలు, స్థానికుల సహాయంతో రోడ్డుపై పడిన వ్యర్థాలను పూర్తిగా తొలగించారు. రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘించి, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన సదరు ట్రక్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

