మిగిలింది ఇద్దరే గదా… ఎమ్మెల్యేల అనర్హతపై ‘సుప్రీం’

కలం, తెలంగాణ బ్యూరో : పలువురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు  (Supreme Court) మూడు వారాల తర్వాతకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు గతంలో విధించిన డెడ్‌లైన్ ప్రకారం ఇప్పటికి మొత్తం పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మాసిష్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకున్న స్పీకర్.. ఇంకో ఇద్దరిపై తీసుకోవాల్సి ఉన్నదని వ్యాఖ్యానించింది. పెండింగ్‌లో ఉన్న ఇద్దరిపైనా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించిన ధర్మాసనం.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. మార్చి నెలకల్లా ఈ ఇద్దరిపైనా నిర్యయం తీసుకుంటారని, లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని బెంచ్ స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని, ఇప్పటికే మూడు వారాల సమయాన్ని స్పీకర్ తీసుకున్నారని, ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయని వాదించారు. గత విచారణ సమయానికి ముగ్గురిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, కానీ ఒక్కరి విషయంలోనే నిర్ణయాన్ని ప్రకటించారని, ఇంకా ఇద్దరివి పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వివరణ ఇస్తూ, ఇప్పటికే ఎనిమిది మందిని విచారణకు పిలిచి ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత నిర్ణయం తీసుకున్నారని, ఇంతమందిపై విచారణ పూర్తి చేసి నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు ఇంకో ఇద్దరివి మాత్రం ఎందుకు పూర్తి చేయరని వ్యాఖ్యానించారు. ఈ వాదనలతో సంతృప్తి చెందిన బెంచ్.. తదుపరి విచారణను మూడు వారాల తర్వాతకు వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>