కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పీజీ వైద్య సీట్ల (PG Medical Seats) భర్తీ కౌన్సిలింగ్ పొడిగింపు అంశంపై సుప్రీం కోర్టు (Supreme Court)లో సోమవారం విచారణ జరిగింది. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. కౌన్సిలింగ్ పొడిగింపుపై ఆలోచించి చెప్పాలని జాతీయ మెడికల్ కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ పి.ఎస్.నరసింహ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కమిషన్ను ఆదేశించింది. విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. సీట్లు వృథా కాకుండా ఉండాలని కమిషన్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. సీట్ల భర్తీ కౌన్సిలింగ్ పొడిగింపు అంశంపై విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
తెలంగాణ, ఏపీలో ఖాళీగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల (PG Medical Seats) భర్తీ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరుతూ ప్రైవేటు వైద్య కాలేజీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ఫిబ్రవరి 28తో ముగిసింది. అయినప్పటికీ ఏపీలో 235, తెలంగాణలో 377 సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయని, వీటి భర్తీకి గడువు పొడిగించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాయి. దీంతో ఈ పిటిషన్లపై మార్చి 20న విచారణ చేపట్టిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)కి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఇవాళ్టి వాయిదా వేయగా.. సోమవారం ధర్మాసనం విచారించింది.
Read Also: కొరత లేదంటూనే.. కోతలు, వాతలు
Follow Us On: X(Twitter)

