కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ నిజామాబాద్ (Nizamabad) బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి (Dinesh Kulachari) ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు.. పోలీసులు పార్టీ నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కు తరలివచ్చారు. ఈ సందర్బంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ పటేల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చినా.. వాటిలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు.
ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదని గుర్తు చేశారు. ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఓటు వేసిన ప్రజలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనేక మంది వృద్ధులు, వికలాంగులు ఒంటరి మహిళలకు ఇప్పటికీ పెన్షన్లు మంజూరు కాలేదని ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులందరి దరఖాస్తులను వెంటనే ఆమోదించి వారికి పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు.
పేదలకు ప్రభుత్వం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన లబ్దిదారులకు వెంటనే ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు దరఖాస్తులు సమర్పించినప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, ఆ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. బడ్జెట్ లో నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు నిధులు కేటాయించక పోవటం పట్ల బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ కుమార్, పాలెపు రాజు, దాంపల్లి జ్యోతి, పోల్కం వేణు, సంఘం అనిల్, ఓం సింగ్ నాయక్, నాయిడి రాజన్న, చింత ప్రసన్నారెడ్డి బొబ్బిలి వేణు, బంటు ప్రీతి, కల్పే అర్చన, శశాంక్ రెడ్డి, ఇప్పకాయల కిషోర్, చింతకాయల రాజేందర్, నిమ్మల శ్రావణ్,ఎర్రం సుధీర్, యాదాల నరేష్, మల్క మహేందర్ ఆనంద్ రావు, శంకర్ రెడ్డి, జగన్ రెడ్డి, గడ్డం రాజు, జంగిటి ఆనంద్, దండు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: 41 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం : ప్రధాని మోదీ
Follow Us On: Instagram

