కలం, వెబ్ డెస్క్: భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ (Vinesh Phogat) ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ వివాదానికి సుప్రీంకోర్టులో తెరపడింది. ఈ ట్రయల్స్ ప్రక్రియ అప్పటికే పూర్తి కావడంతో, భారత కుస్తీ సమాఖ్య (WFI) దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం గురువారం క్లోజ్ చేసింది. అయితే కోర్టుల చుట్టూ తిరిగిన వినేష్కు మైదానంలో మాత్రం నిరాశే ఎదురైంది. ట్రయల్స్ సెమీస్లోనే ఆమె ఓడిపోవడంతో ఏషియన్ గేమ్స్ ఆశలు గల్లంతయ్యాయి.
డబ్ల్యూఎఫ్ఐ సవరించిన రూల్స్ ప్రకారం వినేష్ అర్హత సాధించకపోయినా, ఆమెకు ట్రయల్స్లో పాల్గొనే ఛాన్స్ ఇస్తూ గత నెలలో ఢిల్లీ హైకోర్టు ఇంటర్రిమ్ ఆర్డర్స్ ఇచ్చింది. మాతృత్వం అనేది ఒక క్రీడాకారిణి కెరీర్కు అడ్డంకి కాకూడదని, ప్రసవం తర్వాత కోలుకునే సమయాన్ని డబ్ల్యూఎఫ్ఐ సరిగ్గా లెక్కించలేదని హైకోర్టు తప్పుపట్టింది. ఈ తీర్పును సవాలు చేస్తూ డబ్ల్యూఎఫ్ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ల బెంచ్ ఈ కేసును విచారించింది. డబ్ల్యూఎఫ్ఐ తరఫు లాయర్ స్పందిస్తూ.. హైకోర్టు తమపై చేసిన బ్యాడ్ కామెంట్స్ వల్ల వేరే కేసులపై ప్రభావం పడుతుందని, వాటిని తొలగించాలని కోరారు. దానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, తాము కేసును ముగించడం అంటే ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను సమర్థించినట్లు కాదని, ఆ అంశాలను ఇంకా ఓపెన్గానే ఉంచుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కోర్టు పర్మిషన్తో మే 30, 31 తేదీల్లో ఢిల్లీలో జరిగిన 53 కేజీల విభాగం ట్రయల్స్లో వినేష్ ఫోగట్ (Vinesh Phogat) బరిలోకి దిగారు. కానీ సెమీఫైనల్స్లో మీనాక్షి గోయాత్ చేతిలో 4-6 తేడాతో వినేష్ ఓడిపోయారు. దీంతో జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026కు ఆమె క్వాలిఫై కాలేకపోయారు.
Read Also: ఎలియట్ అండర్సన్ కోసం సిటీ బిడ్ తిరస్కరించిన ఫారెస్ట్
Follow Us On: Instagram

