కలం, కరీంనగర్ బ్యూరో: చొప్పదండి (Choppadandi) నియోజకవర్గంలోని రామడుగు, గంగాధర, చొప్పదండి, బోయినిపల్లి మండలలాల్లో నీటి వనరుల సంరక్షణ కరువైందని, నీటి పారుదల శాఖ అధికారులు చెరువుల నిర్వహణ పట్టించు కోకపోవడంతో చెరువులలో మట్టి ఆక్రమంగా తవ్వుతున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravishankar) అన్నారు. బుధవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి, గంగాధర మండలంలోని కురిక్యాల చెరువును ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ధనార్జనే ధ్యేయంగా మట్టి మాఫియా చెరువులను విధ్వంసం చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని, చొప్పదండి నియోజకవర్గంలో నీటి వనరుల శాఖ, నీటి పారుదల శాఖ అధికారులు చెరువుల నిర్వహణ పట్టించుకోకపోవడంతో చెరువులలో మట్టి ఆక్రమంగా తవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి తవ్వకాలను నియంత్రించాల్సిన ఇరిగేషన్, మైనింగ్ శాఖల ఆధికారులు పట్టించుకోకపోవడంతో చెరువులు రూపురేఖలు కోల్పోతున్నాయన్నారు.
మట్టి మాఫియా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipally Sathyam), అధికారుల అండదండలతో తవ్వకాలను యథేచ్ఛగా నిర్వహిస్తోందని ఆరోపించారు. ఈ మధ్యనే ఇక్కడి కాంగ్రెస్ నాయకుడు అనుమతులకు మించి అధికంగా తవ్వకాలు జరుగుతున్నాయని లారీలకు అడ్డంగా పడుకున్నాడన్నారు. చెరువులను గుర్తించి తవ్వకాలకు ముందే ముడుపులు చెల్లించే వారికి చెల్లించి ఒకటి, రెండు రోజుల్లోనే చెరువులను అడ్డగోలుగా తవ్వేసి ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానికంగా ప్రజలు కూడా అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోందని చెప్పారు. నిబంధనలు నీటిపై రాతలేనా? అని ప్రశ్నించారు. ప్రకృతి సహజ సంపదను కొల్లగొడితే సహించేది లేదన్నారు.

