కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు సుగాలి ప్రీతి తల్లి (Sugali Preeti) పార్వతి షాకిచ్చారు. తన కుమార్తె కేసులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తరచూ తన కుమార్తెకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడారని, అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా తన కుమార్తె కేసులో ఎలాంటి పురోగతి లేదన్నారు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేయడానికి పవన్ కల్యాణ్ వందలాది మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు, పరుగులు పెట్టించారని అన్నారు. తన కూతురి కేసు విషయంలో మాత్రం అడుగు కూడా ముందుకు పడటం లేదని విమర్శించారు. తన కుమార్తెపై దారుణానికి పాల్పడ్డ వారు రాష్ట్ర మంత్రుల ఇండ్లల్లో, కర్నూలులో స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. ప్రశ్న రావణ్ అరెస్ట్ పై పెట్టిన శ్రద్ధలో పది శాతం తన కుమార్తె కేసుపై పెడితే తమకు న్యాయం జరిగేదన్నారు. పవన్ కల్యాణ్ ఎందుకు తమపై ఇంత వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు.

