కలం, జోగుళాంబ గద్వాల: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా గద్వాల మండలం కొండపల్లి ఎంపీపీఎస్ పాఠశాల (MPPS Kondapalli) కు చెందిన విద్యార్థిని ప్రసన్న జూన్ 2025 నుండి మార్చి 5, 2026 వరకు నిరంతరాయంగా పాఠశాలకు హాజరైంది. అద్భుతమైన సమయపాలన ప్రదర్శించిన విద్యార్థిని ప్రసన్నకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ అభినందన పత్రాన్ని అందించారు. సోమవారం పాఠశాల ప్రార్థన సమయంలో అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మప్ప, ఉపాధ్యాయ బృందం ప్రసన్నను ఘనంగా అభినందించారు. విద్యాశాఖ ఉన్నతాధికారి నుండి ప్రశంసా పత్రాన్ని అందుకోవడం పాఠశాలకే కాకుండా గ్రామానికి ఎంతో గర్వకారణమని, ప్రసన్న క్రమశిక్షణను తోటి విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు పాల్గొన్నారు.

