కలం, వెబ్ డెస్క్: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ (Prateek Yadav) ఆకస్మికంగా మరణించారు. లక్నో సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు భార్య అపర్ణ యాదవ్ ఉన్నారు. ప్రతీక్ మరణంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అపర్ణ యాదవ్కు సంతాపం ప్రకటించారు. 38 ఏళ్ల ప్రతీక్ మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది.
రాజకీయ కుటుంబమే అయినా..
ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడే ప్రతీక్ యాదవ్. తండ్రి సీఎం, ప్రముఖ రాజకీయ నేతగా ఉన్నప్పటికీ.. ప్రతీక్ మాత్రం అటు వైపు వెళ్లలేదు. స్థిరాస్తి వ్యాపారం, జిమ్ సెంటర్ల నిర్వహణ చేస్తున్నారు. 2011లో అపర్ణ యాదవ్తో వివాహం జరిగింది. ఆమె రాజకీయంగా చాలా క్రియాశీలకంగా ఉన్నారు. 2011లో లక్నో కంటోన్మెంట్ నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2022లో బీజేపీలో చేరి, ప్రస్తుతం యూపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా ఉన్నారు. కాగా, ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య కుమారుడు అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

