కలం, నల్లగొండ బ్యూరో : మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MG University)లో నీటి సమస్య (Water Shortage) తీవ్ర రూపం దాల్చింది. గత నెల రోజులుగా యూనివర్సిటీ హాస్టళ్లలో నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలైన స్నానం, శుభ్రత పనులకూ నీరు అందక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎలాంటి పరిష్కారం కనిపించకపోవడంతో గురువారం తెల్లవారుజామున విద్యార్థులు హాస్టల్ ప్రాంగణంలో భారీగా ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్సిటీలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణ పనుల కోసం విద్యార్థులకు సరఫరా కావాల్సిన నీటిని మళ్లిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ల పనులకు ప్రాధాన్యం ఇచ్చి, విద్యార్థుల ప్రాథమిక అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నిరసనతో స్పందించిన యూనివర్సిటీ యంత్రాంగం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ తాత్కాలిక చర్యలు సరిపోకపోవడంతో సమస్య యథాతథంగానే కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో కేవలం కంటితుడుపు చర్యలు కాకుండా, శాశ్వతంగా నీటి సరఫరా పునరుద్ధరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యకు వెంటనే పరిష్కారం చూపకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

