కలం, వెబ్ డెస్క్: ఆరోగ్యశ్రీ పథకం పెండింగ్ బిల్లులు (Aarogyasri Bills) ఎప్పటివరకు చెల్లిస్తారో చెప్పాలని రేవంత్ సర్కార్ను బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఆరోగ్యశ్రీ పథకంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్బంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు హరీశ్ రావు ఆరోగ్యశ్రీపై మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 8 వేల కోట్లను ఖర్చు చేసి 18 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందించామని చెప్పారు. 2023-24లో బీఆర్ఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ మీద పెట్టిన ఖర్చు రూ.1,067 కోట్లు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో పెట్టిన ఖర్చు రూ.971 కోట్లు అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథక పరిమితి రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచితే ఖర్చు పెరగాలి కానీ తగ్గిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని ఆయన ఆరోపించారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లో భాగంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం స్థాపించిన ఐటీ టవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్ ఆరోపించారు. కొత్త కంపెనీలు రావడం లేదని.. ఉన్న కంపెనీలు సైతం వెళ్లిపోతున్నాయన్నారు. కనీసం ఇంటర్నెట్ బిల్లు కూడా కట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట ఐటీ టవర్లో ముందు 18 కంపెనీలు ఉండే, కాంగ్రెస్ వచ్చాక 7 కంపెనీలు వెళ్ళిపోయాయని అసెంబ్లీలో మాట్లాడారు.

