కలం, వెబ్ డెస్క్: రైళ్లలో పెట్టే ఫుడ్పై ఇప్పటికే ఎన్నో విమర్శలున్నాయి. తరచూ కల్తీ ఆహారం పెడుతున్నారని, నాణ్యతా ప్రమాణాలు పాటించరని ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. ఇక చాలామంది ఫుడ్ బాగా లేకున్నా చూసీచూడనట్లు వదిలేస్తారు. మామూలు రైళ్లలో కాకుండా వందే భారత్ (Vande Bharat) వంటి ట్రైన్స్లో కూడా ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా ఓ వందే భారత్ ట్రైన్లో పురుగుల ఆహారం పెట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పాట్నా నుంచి టాటానగర్ వెళ్తున్న వందే భారత్ (21896) ట్రైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడికి ఇచ్చిన ఫుడ్లో పెరుగులో పురుగులు ఉండటం చూసి షాకయ్యాడు. ఆ ప్రయాణికుడు దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఒక కప్ పెరుగులో పురుగుల్ని ముందే చూశామని, ఇంకో కప్లో సగం తిన్నాక పురుగుల్ని గమనించామని చెప్పారు. దీనికి సంబంధించి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై ఇండియన్ రైల్వేస్ వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకుంది. IRCTCకి, సర్వీస్ ప్రొవైడర్కు భారీ జరిమానా విధించింది. ఇందులో IRCTCకి రూ.10 లక్షలు, సర్వీస్ ప్రొవైడర్పై రూ.50 లక్షల జరిమానా మోపింది. సదరు ఫుడ్ సర్వీస్ కాంట్రాక్ట్ సైతం రద్దు చేసింది. అధికారులు రైళ్లలో ప్రయాణికులకు పెట్టే ఆహారంపై దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

