కలం, వెబ్ డెస్క్: మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో కురిసిన గాలి వాన తీవ్ర బీభత్సం సృష్టించింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మహబూబ్నగర్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ (MUDA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక భారీ బస్ షెల్టర్ (Bus Shelter) ఈదురు గాలుల ధాటికి అమాంతం రోడ్డుపై పేక మేడలా కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా వీచిన బలమైన గాలుల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్ షెల్టర్ వద్ద ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు చెప్తున్నారు.
ఈ గాలి వాన బీభత్సంతో జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు పరిసరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. గాలుల తీవ్రతకు రోడ్డు పక్కన ఉన్న పలు హోటళ్లు, వ్యాపార దుకాణాల రేకుల పైకప్పులు గాల్లోకి ఎగిరిపోయాయి. కలెక్టరేట్ ఎదుట మెయిన్ రోడ్డుపై బస్ షెల్టర్ కూలిపోవడంతో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి రోడ్డు పై కూలిన బస్ షెల్టర్ను తొలగించే చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు నిర్మాణాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!
Read Also: తమిళనాడు సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్..!

