కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వరి ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని అయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు (Paddy Procurement) ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తూకం, నాణ్యత పరీక్షలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రైతులకు సరిపడా వరి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తేమ శాతం (మాయిశ్చర్) పేరుతో రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని.. తరుగు పేరుతో ధాన్యాన్ని అధిక మొత్తంలో కోత విధిస్తున్నారని ఆరోపించారు.
ధాన్యం అమ్మిన తర్వాత రైతులకు చెల్లింపులు సమయానికి జరగడం లేదని మాజీ మంత్రి మండిపడ్డారు. చెల్లింపుల ఆలస్యంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కొంతమంది రైతులు పంటను కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడిచినా తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారని చెప్పారు. వర్షాలు పడితే ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని.. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయమైన ధర కల్పించి, సమయానికి చెల్లింపులు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి రైతులను ఆదుకోవాలని శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) కోరారు.
Read Also: చమురు సంక్షోభం.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రం కీలక నిర్ణయం..!
Follow Us On : WhatsApp

