కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించే దిశగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ (AP Cabinet) సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమావేశంలో పొదుపు చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించేందుకు ‘నా దేశం – నా బాధ్యత’ పేరుతో భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పొదుపులో భాగంగా మంత్రుల విదేశీ పర్యటనలపై కొన్నాళ్ల పాటు నిషేధం విధించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వారానికి ఒకరోజు ఖచ్చితంగా ‘నో వెహికల్ డే’ పాటించాల్సి ఉంటుంది. ఆ రోజున ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనల సమయంలో కూడా భారీ ఖర్చులకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
పాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తూ మెజారిటీ సమావేశాలను వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. భౌతికంగా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేని ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (Work From Home) వెసులుబాటు కల్పించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ ఆదా కోసం ఏసీ ఉష్ణోగ్రతను 24 నుండి 27 డిగ్రీల మధ్యే ఉంచాలని నిబంధన విధించారు. మంత్రులు, ఉన్నతాధికారుల వాహనాల సంఖ్యను తగ్గించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఆడంబరాలకు స్వస్తి పలకాలని క్యాబినెట్ (AP Cabinet) నిర్ణయించింది.
Read Also: ఏపీ విద్యా వ్యవస్థలో కీలక అడుగు
Follow Us On : WhatsApp

