కలం, వెబ్ డెస్క్: హైడ్రా హిట్లర్లా పని చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. ఏదైనా పట్టుదలతో సాధించేవాడు హిట్లర్ అని సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశ్యమని చెప్పారు. కేసీఆర్ పాలనలో హిట్లర్లా ప్రగతి భవన్ బంకర్ లను నిర్మించారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ఆ బంకర్లను తొలగించామని చెప్పారు. గురివింద సామెతలా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని.. ఉక్కుసంకల్పంతో చట్టం పరిధిలోనే హైడ్రా పనిచేస్తోందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జా కోరల నుంచి చెరువులు, ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడుతోందని చెప్పారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మునిగిపోయిన పార్టీ అని.. రానున్న ఎన్నికల్లో 10 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.

