కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి (INDIA Bloc) నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి కూటమిలోని 25 పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సంద్భంగా ఐదు అంశాలపై కూటమి నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ సహా విద్యా శాఖలో జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఖర్గే వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, అందరినీ ఆహ్వానించాలని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగం, ధరల పెరుగుదలతో పాటు ఇతర అంశాలపై అఖిలపక్షంలో చర్చించాలని డిమాండ్ చేశారు.
ఓటర్ జాబితా సవరణ పేరుతో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తామని, సర్ ప్రక్రియలో జరుగుతున్న మోసాలపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తామని ఖర్గే తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇండియా కూటమి సమావేశం అవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెండు నెలల తర్వాత వచ్చే ఆగస్టు 8న హైదరాబాద్లో ఇండియా కూటమి సమావేశం కానుందని వెల్లడించారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతి రోజు ఉదయం పార్లమెంట్ కోఆర్డినేషన్ కోసం ఇండియా కూటమి సమావేశం కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితరులు పాల్గొన్నారు.

