కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన నీట్ తో సహా పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పట్ల విద్యార్థుల్లో విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు గాను సంస్థలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఎన్టీఏ నుంచి 47 మంది అధికారులను (NTA Officers), సిబ్బందిని తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఆయా 47 మంది అధికారులపై లీగల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
నీట్ పరీక్షపేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ, కాంగ్రెస్ పార్టీ సహా పలువురు విద్యార్థులు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో జేఈఈ, నీట్ సహా పలు కీలక పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏలో భారీ ప్రక్షాళన చేపట్టింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో ఇకపై చిన్నపాటి పొరపాట్లకు కూడా తావివ్వకూడదనే స్పష్టమైన లక్ష్యంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వివరించింది.

