Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో తల్లి, కూతురి పతకాల పంట

కలం, వెబ్ డెస్క్: అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌(Yogasana Championship)లో అమెరికాకు చెందిన తల్లి, కూతురు జోడీ విశేషంగా మెరిసింది. కెమీ బ్లేక్ స్వర్ణ పతకం గెలవగా, ఆమె కుమార్తె కిమాని బ్లేక్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయాలతో ఇద్దరూ స్వదేశానికి గర్వంగా తిరిగి వెళ్లారు. ఈ పోటీల్లో 35 ఏళ్ల కెమీ బ్యాక్ బెండ్ ఇండివిడ్యువల్ విభాగంలో బంగారు పతకం సాధించింది. 16 ఏళ్ల కిమాని జూనియర్ ఆర్టిస్టిక్ ఇండివిడ్యువల్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకుంది.

పోటీలకు ముందు ఇద్దరూ అహ్మదాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రంలో భారత క్రీడాకారులతో కలిసి శిక్షణ పొందారు. భారత్‌తో ఉన్న ఈ అనుబంధం వారి విజయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. కెమీ ప్రయాణం యోగాతో మొదలైనది కాదు. ఆమె మొదట ప్రొఫెషనల్ కాంటోర్షనిస్ట్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం న్యూయార్క్ నుంచి లాస్ వెగాస్‌కు వెళ్లి శిక్షణ కూడా తీసుకుంది. ఆ సమయంలో శరీర వంచకత పెంచుకోవడానికి యోగా ప్రారంభించింది. అయితే క్రమంగా యోగా ఆమె జీవితంలో కీలక భాగంగా మారింది.

తాను ఎన్నో సంవత్సరాలుగా యోగా చేస్తున్నప్పటికీ, భారత క్రీడాకారులతో పోటీ పడే స్థాయిలో ఉన్నానని మొదట అనుకోలేదని ఆమె తెలిపింది. ఇతర దేశాల క్రీడాకారులు, భారత కోచ్‌ల ప్రోత్సాహంతో పోటీల్లో పాల్గొని చివరకు స్వర్ణ పతకం సాధించగలిగినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. యోగాతో తన జీవనశైలి పూర్తిగా మారిపోయిందని కూడా కెమీ వెల్లడించింది. ఆ తర్వాత ఒక సంవత్సరం యోగా సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేసింది. భారతదేశంలో ఒక నెల పాటు ఉన్నత శిక్షణ తీసుకుని, తర్వాత స్వయంగా శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించింది.

తల్లి అడుగుజాడల్లో కిమాని కూడా యోగాసనాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంది. జిమ్నాస్టిక్స్‌లో పాల్గొంటూ, ప్రొఫెషనల్ డ్యాన్సర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆమె, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు కేవలం మూడు వారాల ముందు ప్రత్యేకంగా శిక్షణ ప్రారంభించింది. ఆ కృషికి ఫలితంగా కాంస్య పతకం దక్కిందని తెలిపింది. పోటీలకు కొన్ని వారాల ముందే అహ్మదాబాద్ చేరుకున్న ఈ జోడీ భారత కోచ్‌లతో కలిసి సాధన చేసింది. అక్కడి క్రీడాకారులు కూడా వారికి సహకరించారు.

భారత్ చేరుకున్నప్పుడు సామాన్లు ఆలస్యంగా వచ్చినప్పటికీ, భారత జట్టు సాదరంగా ఆహ్వానించి సహాయం చేసిందని కెమీ గుర్తుచేసుకుంది. పోటీకి ముందు చేసిన కొన్ని తప్పులను భారత క్రీడాకారులే గుర్తించి చెప్పడంతో తన ప్రదర్శనకు ఉపయోగపడిందని వివరించింది. భారత క్రీడాకారులు, కోచ్‌ల నుంచి లభించిన ఆదరణ తమపై చిరస్థాయిగా ముద్ర వేసిందని ఆమె పేర్కొంది.

భవిష్యత్తులో యోగాసనానికి ఒలింపిక్స్‌లో స్థానం దక్కాలని కెమీ ఆశాభావం వ్యక్తం చేసింది. యోగా, యోగాసనం రెండూ వేర్వేరు అంశాలని, యోగాసనంలో ఏకాగ్రతతో పాటు అత్యంత ఖచ్చితత్వం అవసరమని ఆమె వివరించింది. యోగాసనం ఒలింపిక్స్‌లో చోటు సంపాదించే దిశగా తాను అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>