కలం, వెబ్డెస్క్: Spiritual Darshan | హిందూ ధర్మంలో దేవాలయ దర్శనం తర్వాత గుడిమెట్లపై లేదా ఆలయ ప్రాంగణంలో కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక పవిత్రమైన సాంప్రదాయం. అయితే ఈ ఆచారం వెనుక భక్తితో పాటు ఎన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాలు, శాస్త్రీయ కారణాలు కూడా దాగి ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
మత విశ్వాసాల ప్రకారం, ఆలయ పైభాగాన్ని దైవం యొక్క ముఖంగా భావిస్తారట. అలాగే ఆలయ మెట్లను దైవ పాదాలుగా పరిగణిస్తారట. ఈ నేపథ్యంలోనే ఆలయ మెట్లపై కూర్చోవడం శుభమా, అశుభమా అనే విషయంపై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. దేవాలయ దర్శనం (Spiritual Darshan) చేసుకున్న తర్వాత చాలామంది భక్తులు కొంతసేపు గుడి మెట్లపై కూర్చొని, ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. ఇది కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాదంటున్నారు పండితులు. దీని వెనుక ఆధ్యాత్మిక శాంతి (Spiritual Peace) ఉంటుందని సనాతన ధర్మం చెబుతుంది. ఈ విషయాన్ని చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుని ఉంటారు.
దేవాలయ నిర్మాణం – దైవ స్వరూపం
సనాతన సంప్రదాయం ప్రకారం.. దేవాలయాన్ని ఒక దైవ స్వరూపంగా భావిస్తారు. దేవాలయం శిఖరం దేవుని తల లేదా ముఖాన్ని సూచిస్తే, మెట్లు దేవుని పాదాలుగా భావిస్తారు. అందుకే భక్తులు శిఖరాన్ని దర్శిస్తూ కళ్లను తెరిచి దేవుడిని ధ్యానిస్తారు. అదే విధంగా, మెట్లపై కూర్చుని కళ్లను మూసుకుని భగవంతుని స్మరిస్తారు.
మెట్లపై కూర్చోవడం వల్ల కలిగే శుభఫలితాలు
ఆలయ మెట్లు దైవ పాదాల వంటివిగా భావిస్తారు. అందుకే అక్కడ ప్రశాంతంగా కూర్చొని భక్తితో ప్రార్థిస్తే దేవుడు మన మనసులోని కోరికలను ఆలకిస్తాడని భక్తుల నమ్మకం. ఇలా చేయడం వల్ల మనసుకు శాంతి కలగడంతో పాటు, జీవితంలోని బాధలు తగ్గి ఆత్మీయ ఆనందం లభిస్తుందని విశ్వసిస్తారు భక్తులు. అలాగే, ఆలయ శిఖరాన్ని భక్తితో దర్శించడం ద్వారా కూడా దైవ అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. తల వంచి శిఖరాన్ని దర్శిస్తే పాప విమోచనం, మానసిక ప్రశాంతత, సుఖసంతోషాలు కలుగుతాయని మత విశ్వాసం.
మెట్లపై కూర్చొని పఠించాల్సిన శ్లోకం
భక్తులు మెట్లపై కూర్చొని దేవుడిని ధ్యానించే ముందు ఈ స్లోకం పఠించాలని చెబుతున్నారు. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం। దేహాంతే తవ సాన్నిధ్యం, దేహి మే పరమేశ్వర॥. దీని అర్థం.. ఓ పరమేశ్వరా! నేను బాధలు లేకుండా, ఇతరులపై ఆధారపడకుండా జీవించాలి. చివరి శ్వాస వరకు నీ సాన్నిధ్యం నాతో ఉండాలి. అలాంటి వరం ప్రసాదించు.
అయితే గుడిమెట్లపై కూర్చోవడం శుభమే అయినప్పటికీ కొన్ని సార్లు మనం చేసే పనులు శుభాన్ని కాస్త అశుభంగా మారుస్తాయి.
గుడిమెట్లపై కూర్చున్నప్పుడు చేయకూడని తప్పులు
లౌకిక విషయాలు మాట్లాడటం, వ్యాపారం, రాజకీయాల గురించి చర్చించడం, ఇతరులను విమర్శించడం, చెడు మాటలు మాట్లాడటం, కోపం లేదా అసూయ వ్యక్తం చేయడం వంటి పనులు చేయడం అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఆ ప్రదేశం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి గుడిలోనైనా, గుడి మెట్లపైనైనా కూర్చున్నప్పుడు భగవంతుని ధ్యానం, ప్రార్థన, మౌనం వంటి పవిత్ర భావనలతో ఉండటం ఉత్తమం.
Read Also: తలనొప్పి ప్రదేశాల రహస్యాలు.. ఏ భాగంలో నొప్పి వస్తే ఏ సమస్యో తెలుసా?
Follow Us On : WhatsApp

