కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో (West Bengal) బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే, కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధ పడుతుందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. విదేశీయుల ఓట్లు తొలగిస్తే రాహుల్ గాంధీకి ఏం నొప్పి? అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లను ఎందుకు పెట్టట్లేదు? అని ప్రశ్నించారు. ఎన్నికల కమీషన్ చేసే ప్రక్రియను ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి ఎస్ఐఆర్ (SIR)కు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం లేదని, అందుకే ఉద్యోగులకు మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే జరుగుతుందని అన్నారు. ఎస్ఐఆర్ ద్వారా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. అది ఏ గ్రామంలో జరిగిందో నిరూపించాలని డిమాండ్ చేశారు.
అటు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు అవస్థలు పడుతున్నారని కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెల దాటుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని దుయ్యబట్టారు. దీనిపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి, మంత్రులు ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు క్షేత్ర స్థాయిలో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ధాన్యం దిగుబడి పెరిగిందని.. దానికి అనుగుణంగా ప్రభుత్వ కార్యాచరణ లేదని చెప్పారు.
Read Also: విజయ్ నిర్ణయాన్ని గౌరవిద్దాం.. ఆ మంత్రి నియామకంపై లారెన్స్ పోస్ట్!
Follow Us On: X(Twitter)

