కలం, మహబూబ్నగర్ బ్యూరో : జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లాలో రైల్వే ఉద్యోగాల పేరుతో జరిగిన భారీ మోసం (Railway Job Scam) వెలుగులోకి వచ్చింది. తాను రైల్వే ఉద్యోగినని చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి, లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన ధరూర్ (Dharur) మండలంలో కలకలం రేపుతోంది. ధరూర్ మండలం పూడూరు గ్రామానికి చెందిన పుల్లన్న అనే వ్యక్తి, తాను రైల్వేలో పనిచేస్తున్నానని చెప్పి పలు గ్రామాల నిరుద్యోగుల తల్లిదండ్రులను నమ్మించాడు. ముఖ్యంగా అల్వాల్పాడు గ్రామానికి చెందిన కొందరు కుటుంబాలు అతని మాటలు నమ్మి తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో భారీగా డబ్బులు చెల్లించారు. ఈ క్రమంలో నిందితుడు బాధితుల నుంచి మొత్తం సుమారు రూ.16.80 లక్షలు వసూలు చేశాడు.
అయితే, చాలా కాలం గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులకు అనుమానం కలిగింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని నిందితుడిపై ఒత్తిడి తెచ్చినా, అతడు అందుబాటులోకి రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించారు. దీంతో బాధితులు ధరూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ధరూర్ ఎస్ఐ నందీకర్ స్పందిస్తూ, రైల్వే లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులను నమ్మి ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అన్నీ అధికారిక విధానాలలోనే జరుగుతాయని, ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

