కలం, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతటా నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) విస్తరించాయి. దీంతో మంగళవారం పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఎండ ప్రభావం కూడా ఉండొచ్చని హెచ్చరించింది. నేడు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని హెచ్చరించింది. వర్షాల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడి ఉండే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని సూచించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే.. పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేసింది.

