కలం, మిర్యాలగూడ: నల్గొండ (Nalgonda) జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా పోలీస్ శాఖ, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (Sharat Chandra Pawar) ఆదేశాల మేరకు మిర్యాలగూడ (Miryalaguda) పట్టణంలో సోమవారం అర్ధరాత్రి “ఆపరేషన్ చబుత్ర” పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో భాగంగా స్టేట్ హైవే వెంట ఉన్న ధాబాలు, లాడ్జీలు, హోటల్స్, టీ స్టాళ్లు, రద్దీ కూడళ్లు, పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, రాత్రివేళల్లో యువకులు గుమిగూడే ప్రదేశాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
పోలీసులు ప్రతి వ్యక్తి వివరాలను పరిశీలిస్తూ, వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తూ సరైన ఆధారాలు లేని 10 ద్విచక్ర వాహనాలు పట్టుకుని, 78 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి వివరాలు నమోదు చేసి కౌన్సెలింగ్ నిర్వహించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, భవిష్యత్తులో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని గట్టిగా హెచ్చరించారు. అలాగే ఆరుగురు దాబా నిర్వహకుల పైన కేసులు నమోదు చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, 20 మంది లా అండ్ ఆర్డర్ సిబ్బంది, 10 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. “జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, రౌడీయిజం, గంజాయి, మద్యం అక్రమ రవాణా, పేకాట, ఈవ్ టీజింగ్, రాత్రివేళల్లో అనుమానాస్పద సంచారం వంటి చట్టవ్యతిరేక చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రి వేళల్లో ధాబాలు, లాడ్జీలు, హోటల్స్ను అడ్డాగా చేసుకుని నేరాలకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.” అని స్పష్టం చేశారు.

