Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం రేవంత్‌తో సౌతాఫ్రికా బృందం భేటీ: పెట్టుబడులపై చర్చ!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCR HRD) వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth)తో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ పాల్ మాషతిలే నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సమావేశమైంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే దక్షిణాఫ్రికా వ్యాపార సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు, సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.

ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, తెలంగాణ-దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని విస్తరించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అనుకూల విధానాలు, బలమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ, కీలక రంగాలలో అందుబాటులో ఉన్న విస్తృత అవకాశాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణ అద్భుతమైన వృద్ధి పథం ఇక్కడి ప్రజల సంకల్పం, ఆవిష్కరణలు, వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శనమని మాషతిలే కొనియాడారు. తెలంగాణ దేశ జీడీపీకి గణనీయమైన సహకారాన్ని అందించే స్థాయికి ఎదగడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, పెట్టుబడుల రంగాలలో తెలంగాణతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా ఆసక్తిగా ఉందన్నారు. ఇరు ప్రాంతాల వ్యాపార, సంస్థాగత భాగస్వామ్యాలను పెంపొందించడానికి న్యూఢిల్లీలోని దక్షిణాఫ్రికా హైకమిషన్ చురుగ్గా వ్యవహరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

భారతదేశం, దక్షిణాఫ్రికాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. సమాచార సాంకేతికత (IT), లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సిన్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, రీసెర్చ్, విద్య, వైద్యం, తయారీ రంగం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాలలో తెలంగాణకు ఉన్న బలాన్ని ఆయన వివరించారు. గ్రీన్ ఎనర్జీ, స్థిరమైన అభివృద్ధి రంగాలలో కూడా తెలంగాణ నాయకత్వ పాత్రను పోషిస్తోందని చెప్పారు. భారత్-దక్షిణాఫ్రికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15.57 బిలియన్ డాలర్లకు చేరుకుందని, ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కంపెనీలు తెలంగాణలోని అవకాశాలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే దక్షిణాఫ్రికాలో ఉన్న అభివృద్ధి అవకాశాలను అందుకోవడానికి తెలంగాణకు చెందిన సంస్థలను కూడా ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>