Mobile Popup Ad
Mobile Popup Ad

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం.. కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి (Wanaparthy) జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) ఆదేశించారు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల సరఫరాపై టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, నకిలీ విత్తనాల విక్రయాలను పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పంటల మార్పిడిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. రైతులు వరి సాగుపై ఆసక్తి చూపితే సన్న రకం వరి సాగును ప్రోత్సహించాలని, దొడ్డు రకాల సాగును తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే కొన్ని మండలాలలో సాగవుతున్న దాన్ 75 (DAN 75) వరి రకాన్ని రైతులు వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ రకానికి మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడంతో కొనుగోళ్లు జరగడం లేదని, రైతులు నష్టపోకుండా ముందస్తుగా చైతన్యం కల్పించాలని తెలిపారు.

యూరియా వినియోగంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గత సీజన్‌లలో  అధిక మొత్తంలో యూరియా కొనుగోలు చేసిన వారిని గుర్తించి, అది నిజంగా వ్యవసాయ అవసరాలకే వినియోగిస్తున్నారా లేదా ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాశ్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మండల వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లు, ఎస్సైలు తదితర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>