కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant Blast) లో భారీ పేలుడు సంభవించింది. స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ (స్టీల్ మెల్టింగ్ స్టేషన్) – 1 లో జరిగిన ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పలువురుకి తీవ్రగాయాలవ్వగా వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో రావురి మల్లికార్జున రావు, పల్లెల శ్రీనివాసరావు, అర్జున్ అప్పారావు, సత్యానంద్ బొవ్వా, హరిబాబు, పైడి రాజు లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పేలుడు దాటికి సీసీడీ విభాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. లిక్విడ్ స్టీల్ తరలిస్తుండగా మరుగుతున్న స్టీల్ పడి కార్మికులు సజీవ దహనం అయ్యారు. లిక్విడ్ స్టీల్ ద్వారా బీమ్స్ తయారు చేసే ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. లాడల్ పేలుడు సంభవించడం ఇదే తొలిసారి అని కార్మికులు చెబుతున్నారు. ప్రమాద జరిగిన సమయంలో 150 టన్నులు మెటల్ లిక్విడ్ ఉందని తెలుస్తోంది. కాగా, పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
విశాఖ స్టీల్ ప్లాంట్ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో కార్మికులు మరణించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడిన చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

